మంచి పుస్తకం-సత్యాన్వేషి చలం (డా.వాడ్రేవు వీరలక్ష్మీ దేవి )

చలం తన జీవితకాలంలో ఎంతో సాహిత్యాన్ని సృజించాడు. అదంతా ఒక సాగరం . ఈ రచనలో  ఆ సాగరాన్ని ఒడిసి పట్టారు రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మీ దేవి .

ఈవిడ చాలా  ఉత్తమాభిరుచి కలిగిన రచయిత్రి. చలం మీద ఇదొక సిద్ధాంత గ్రంథం, ఇదొక ఫరిశోధనా గ్రంధం. చలం అంటే ఎనలేని గౌరవం, అభిమానం కలిగిన వారు ఆంధ్రదేశం లో ఎందరో ఉన్నారు. వారిలో ఈవిడ కూడా ఒకరు.

‘చలం సాహిత్యం లో ఏ ఒక్క పుస్తకమో చదివితే చలం గురించి, చలం భావాల గురించి ఏమీ అర్థం కాదు. పైగా  అది చలం గురించి అనేక అపార్థాలకే దారి తీస్తుంది. ఆయనను విమర్శంచే వారిలో ఎక్కువమంది ఈ కోవకు చెందినవారే. చలాన్ని సరిగా అర్ధం చేసుకోవాలంటే అయన రచనలను అన్నింటినీ అధ్యయనం చేయాలి. అప్పుడే చలం తన జీవితమంతా నిరంతర సత్యాన్వేషణ నెరపాడనే విషయం మరియు ఈ అన్వేషణలో ఆయన కాలనుగుణంగా  క్రమపరిణామం చెందాడనే విషయం మనకు బోధపడుతుంది ‘ అన్న విషయాన్ని రచయిత్రి నిరూపించిన విధానం నిరుపమానం. రచయిత్రి అసమాన ప్రతిభను కనపరిచారు.

చలం గురించి ఎటువంటి అపార్థాలకూ తావు లేకుండా ఆయనను, ఆయన భావాలను సరిగా అర్థం చేసుకోవటానికి ఆవిడ మన తరపున చలం సాహిత్యాన్నంతా చదివి, అర్థం చేసుకుని మనకు దాని సారాన్ని అందించారేమో అనే భావన మనకు కలుగుతుంది. ఒకరకంగా తన జీవితమంతా స్త్రీ స్వేచ్చ గురించే సాహితీ యుద్ధం చేసిన చలానికి స్త్రీ జాతి తరఫున రచయిత్రి అందించిన నివాళిగా ఈ రచనను మనం భావించవచ్చు. రచనా ప్రమణాలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఈ గ్రంథం చదివిన తరువాత మనకు చలం జీవితం తోపాటు ఆయన సాహిత్యమంతటి యెడల, ఆయన భావాల యెడల పూర్తి అవగాహన కలుగుతుంది.

ఇది 285 పేజీల గ్రంధం. వెల రూ.125/-  ఈ పుస్తకం  ‘విశాలాంధ్ర ‘ లో లభిస్తున్నది. చలం రచనలు ప్రచురించే ‘అరుణా పబ్లిషింగ్ హౌస్ ‘, విజయవాడ వారిని సంప్రదించైనా ఈ పుస్తకాన్ని పొందవచ్చు.

వ్యాఖ్యానించండి