మీరు భగవద్గీత చదివారా ?!

నేను చదివిన పుస్తకాలలో ఈ సారి ‘భగవద్గీత’ ను పరిచయం చేద్దామనుకుంటున్నాను. ఈ పరిచయం భగవద్గీత గురించి మీకెవ్వరికీ తెలియదనో లేక మీకందరికీ భారతీయ తత్త్వశాస్త్ర సారంగా ఆ మహా గ్రంథం యొక్క వైశిష్ట్యం ఎటువంటిదో తెలపాలనో ఉద్దేశించి రాయడంలేదు.

గీత మీద వందల సంవత్సరాల నుండి అనేక వ్యాఖ్యానాలు వచ్చినాయి. నేటికాలంలో కూడా అనేక ప్రచురణ సంస్థలు, ధార్మిక, మత సంస్థలు గీతార్ధ వివరణతో కూడిన పుస్తకాలను అనేకం ప్రచురిస్తున్నాయి. వాటిలో నేను చదివిన పుస్తకాల గురించి, గీతను అర్ధం చేసుకునే ప్రయత్నంలో నాకు తోడ్పడిన పుస్తకాలను గురించి మీకు పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో మాత్రమే ఈ వ్యాసం రాస్తున్నాను.

భగవద్గీతా పుస్తకాలు పాకెట్ సైజు నుండి మోయలేనంత బరువుండే పెద్ద గ్రంథాల వరకూ వివిధ సైజులలో లభ్యమవుతున్నాయి. గీతలో అసలు ఉన్నది మొత్తం 701  శ్లోకాలే. కేవలం ఆ శ్లోకాలే ఉండే పారాయణ గ్రంథాలతో మొదలై శ్లోకంతో పాటు కేవలం తాత్పర్యం మాత్రమే ఉండే గ్రంథాలుగా, తాత్పర్యంతో పాటు అర్థ వివరణ కూడా ఉండే గ్రంథాలుగా పుస్తకం పెరిగిపోయి క్రమంగా ఈ వివరణ విస్తారమై పోయి ఒక ఉద్గ్రంథంగా మారేంతవరకూ భగవద్గీత వివిధ సైజులలో మనకు ఇప్పుడు లభ్యమవుతున్నది.

మొదట పెద్ద గ్రంథాలతో మొదలు పెడదాము.

కొన్నాళ్ళ క్రితం అనేకమంది ఇళ్ళల్లో ‘ఇస్కాన్’ వారి భగవద్గీతే కనిపించేది. వారు మొబైల్ బుక్ స్టాల్ ద్వారా చాలా తక్కువ ధరకు నాణ్యమైన కాగితం, బైండింగ్ తో తయారైన గీతను అందించేవారు. అయితే ఇందులోని వివరణ ఓ పట్టాన అర్థమయ్యేది కాదు. కానీ ఆ గ్రంథంలో ముద్రించిన పాశ్చాత్య శైలిలో చిత్రించబడిన చిత్రాలు చాలా ఆకట్టుకునేవి. గీతను కొనడంలో ఎక్కువమంది కుండే ఉద్దేశ్యం ఆధ్యాత్మిక దృష్టే గానీ జిజ్ఞాస కాదు గనుక అర్థంకాక పోయినా ఈ గ్రంథం బాగానే ప్రచారం పొందింది. పైగా తక్కువ వెల కూడాను. దీని ఖరీదు Rs.50/-

తరువాత శ్రీకాళహస్తిలోగల శుకబ్రహ్మాశ్రమ స్థాపకులు శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి చే రచింపబడిన ‘గీతామకరందం’ పేరు తో ఉండే భగవద్గీత అత్యంత ప్రజాదరణ పొందింది. ఇస్కాన్ వారి గీతలా కాకుండా ఇందులోని వివరణ బాగా అర్థవుతుంది. దీని ఖరీదు కొంచెం ఎక్కువ. Rs.300/- వరకూ ఉంటుంది.

శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు (త్రిమతాచార్యులు) వందల సంవత్సరాల క్రితం ఒకరితో ఒకరు విభేదించుకుంటూ గీతకు భాష్యాలు రాశారు. అవన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. ఆ ముగ్గురి అభిప్రాయాలనూ క్రోడీకరిస్తూ కొందరు తమిళ పండితులు తమ భాషలో ఓ గ్రంథాన్ని రాశారు. దానిని తమిళాంధ్ర భాషా ప్రవీణులైన కీళాత్తూరు శ్రీనివాసాచార్యులు గారు తెలుగులోనికి అనువదిస్తే ‘మహా భగవద్గీత’ పేరుతో తిరుపతికి సమీపంలో గల ఏర్పేడు ఆశ్రమం వారు ప్రచురించారు. త్రిమతాచార్యుల అభిప్రాయాలతో ఈ గీత కూడా చాలా బావుంటుంది. దీని ఖరీదు  Rs.125/-

తరువాత నన్నాకట్టుకున్న పుస్తకం ఉత్తర భారతదేశానికి చెందిన జయదయాళ్ గోయందకా గారు హిందీలో ‘శ్రీమద్భగవద్గీత-తత్త్వవివేచనీ వ్యాఖ్య’ పేరుతో ఓ గ్రంథాన్ని రచించాడు. దానిని గీతా ప్రెస్ వారు తెలుగులోకి అనువదించి, ప్రచురించి Rs.80/-లకే అందిస్తున్నారు. ఈ గీతలోని వివరణ అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లుగా ఉంటుంది. మిగతా గీతలలోని వివరణకన్నా ఈ గీతలోని వివరణ చాలా విశిష్టత కలిగినది. ఒక శ్లోకంలో చెప్పిన విషయం గీతలో మరెక్కడెక్కడ ఏఏ విధంగా చెప్పబడిందీ మొదలైన వివరాలతో చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

..ఇవీ నాకు తెలిసిన, నేను చదివిన పెద్ద భగవద్గీతా గ్రంథాలు.

ఇప్పుడు మధ్యస్థాయి గ్రంథాలు చూద్దాం. ఇవీ చాలా ఉన్నాయి. కానీ నన్ను ఆకట్టుకున్న పుస్తకం మాత్రం ఒకే ఒకటి. శిష్ట్లా సుబ్బారావు గారు రాసిన శ్రీమద్భగవద్గీత. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రచురణ. మొదట్లో దీని ఖరీదు  Rs.1/- మాత్రమే. ఇప్పుడు Rs.15/-చొప్పున విక్రయిస్తున్నారు. ఇది T.T.D. వారి ఆస్థాన గ్రంథమంటే నమ్మండి. అంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది T.T.D. ఈ గ్రంథాన్ని. శిష్ట్లా సుబ్బారావు గారు మంచి ఆధ్యాత్మిక దృష్టితో, భక్తిభావంతో చాలా చక్కగా, గీత గురించి పరిచయంలేని వారికి కూడా అర్థమయ్యేటట్లుగా గీతార్థాన్ని వివరించారు. నేను మొట్టమొదట  చదివిన గీత ఇదే.

ఇక తరువాత శ్లోకానికి కేవలం తాత్పర్యం మాత్రమే ఉండే చిన్నసైజు గీతా గ్రంథాలు కూడా చాలా ఉన్నాయి. వాటిలో నేను చదివినది, నాదగ్గర ఉన్నది రావుల సూర్యనారాయణ మూర్తి గారు రచించినది. ఇది కూడా T.T.D. వారి ప్రచురణే. ఇది ఇప్పుడు లభ్యమవుతున్నట్లుగా నేను గమనించలేదు. కేవలం తాత్పర్యం మాత్రమే ఉండే పుస్తకమే గనుక వీటిలో ఒక పుస్తకానికి మరోపుస్తకానికి పెద్ద తేడా ఏమీ ఉండదు.

గీతార్థ వివరణ కొరకు కొన్ని పుస్తకాలు చదివిన మీదట నేనో విషయాన్ని గ్రహించాను.  ఎవరి అర్థవివరణ వారిదే, ఏ ఒక్కరి అభిప్రాయం మిగతావారి అభిప్రాయం తో కలవటం లేదని గ్రహించాను. దాని మీదట నేను ఈ గీతార్థాలను వివరించే పుస్తకాలన్నింటినీ మానేసి కేవలం తాత్పర్యం మాత్రం ఉండే ఈ ఒక్క పుస్తకానికే చాలాకాలంపాటు పరిమితమయ్యాను. నా అర్థాలేవో నేనే వివరించుకోవచ్చులే అనుకున్నాను. అలాగే నాకు తోచిన అర్థాలలో కొన్నింటిని నా ‘శంఖారావం’ బ్లాగులో “భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!” వ్యాసావళిలో (రెండవ అధ్యాయంలో) మీకు వివరించడం జరిగినది.

ఇక కేవలం శ్లోకాలు మాత్రమే ఉండే ‘పారాయణ గీత’ గురించి వివరించడానికేమీ లేదు.

చివరగా గీతార్థాన్ని వివరించే పుస్తకాలలో ఒక విశిష్టమైన పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తాను. ఇది కూడా T.T.D. వారి ప్రచురణే. రచయిత S.B. రఘునాథాచార్య గారు. ఇది ఎంతటి ప్రజాదరణ పొందినదో చెప్పలేము. దానిపేరు ‘మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు’. ఇందులోని వివరణ గీతలోని అధ్యాయాల క్రమంలోగానీ, శ్లోకాల క్రమంలోగానీ ఉండదు. మనలో ఎక్కువ మందికి తరచూ వచ్చే సందేహాలు, ఎదురయ్యే సమస్యలు.. మొదలైన వాటికి గీతలో ఎటువంటి పరిష్కారం, సమాధానం సూచించబడిందో సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఇది కూడా చిన్న గ్రంథమే. ఓ వందపేజీలుంటుంది. దీనిలో గీతలోని ప్రతి శ్లోకమూ ఉండదు. ఏవో కొన్ని శ్లోకాలు మాత్రమే ఉంటాయి. దాని ఖరీదు అప్పట్లో Rs.1/-ఉండేది. ఇప్పుడు Rs.6/-

చివరిగా పై పుస్తకాలన్నీ దొరికే ప్రదేశాల గురించి చెప్పుకుందాం. గీతా ప్రెస్ పుస్తకాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 1 వ నంబరు ప్లాట్‌ఫాం మీద వారి స్టాల్ ఉన్నది. కాచీగూడలోని బాలసరస్వతీ బుక్ డిపోలో కూడా గీతా ప్రెస్ వారి పుస్తకాలు దొరుకుతాయి. ఈ బాలసరస్వతీ బుక్ డిపోలోనే గీతామకరందం, మహా భగవద్గీత కూడా దొరికే అవకాశం ఉంది. ఇక ఇస్కాన్ వారి గ్రంథానికి నాంపల్లి లోని వారి టెంపుల్ లో వారి స్టాల్ ఉన్నది. T.T.D. వారి గ్రంథాలు అనేక పట్టణాలలో ఉన్న వారి కళ్యాణ మండపాలలో ఉన్న వారి స్టాల్స్ లో దొరుకుతాయి. ఇంకా విశాలాంధ్రలో, మామూలు బుక్ స్టాల్స్‌లో కూడా ప్రయత్నించవచ్చు. తిరుమల వంటి పుణ్యక్షేత్రాలలో అయితే వాళ్ళ ప్రచురణలు విక్రయించే స్టాల్స్‌తోపాటు గీతాప్రెస్స్ వంటి ఇతరుల స్టాల్స్ కూడా ఉంటాయి.

మంచి పుస్తకం-Power, Seduction and War (by Robert Greene)

సాధారణంగా ‘లౌక్యం, వ్యవహార దక్షత లాంటి విషయాలనూ, ఎత్తుకు పై ఎత్తు వేసే నైపుణ్యం, వ్యూహ ప్రతివ్యూహాలను పన్నే చాణక్యం.. వంటి విషయాలనూ మాటలలో వివరించడం సాధ్యంకాదు. వాటిని స్వయంగా, అనుభవపూర్వకంగా ఎవరికివారు తెలుసుకోవలసినదే’ అనే అభిప్రాయం ఉన్నది. కానీ రాబర్ట్ గ్రీన్ (Robert Greene) అనే అమెరికన్ రచయిత చాలా నేర్పుగా, అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్లుగా ఆ పరిజ్ఞాన్నంతా మనకు బోధించాడు. Power, Seduction, War అంటూ ఈయన ఆ పరిజ్ఞానాన్నంతా మూడు విభాగాలుగా చేశాడు. ఒక్కొక విభాగానికి ఒక్కొక గ్రంథం చొప్పున మూడు గ్రంథాలు రచించాడు.

మొదటి విభాగమైన Power గురించి వివరించడానికి The 48 Laws of Power అనే గ్రంథం రాశాడు. మనం ఎదుటివారి మీద upper hand సాధించడానికి ఏ విధమైన లక్షణాలను కలిగి ఉండాలి, ఏవిధంగా వ్యవహరించాలి  అనే విషయాలను మొత్తం 48 సూత్రాల రూపంలో పొందుపరస్తూ ఈ పుస్తకం రాశాడు.

రెండవ గ్రంథం  The Art of Seduction. ‘వశీకరణం’- అంటే ఎదుటిమనిషిని లోబరచుకోవడం- గురించి దీనిలో చర్చించాడు. Sex, Wealth, Power or Favor.. ఇలాంటి వాటిని ఎదుటివారి నుండి పొందటం కొరకు ఏ విధమైన పద్దతులను అవలంబించాలో, ఎలా ప్రవర్తించాలో ఇందులో విపులంగా వివరించాడు.

ఇక మూడవ గ్రంథం The 33 Strategies of War . మన ప్రత్యర్థిని అమాయకుడిగా, మన victim గా భావిస్తూ The 48 Laws of Power ను రూపొందించడం జరిగినది. కానీ మన ప్రత్యర్థి మనలాగే Power Player అయిన పక్షంలో అతని మీద మనం ఏ విధంగా upper hand సాధించాలి అనే దాన్ని వివరించడానికి ఈ The 33 Strategies of War  అనే గ్రంథం రాశాడు.

ఈ మూడు గ్రంథాలూ సాధారణమైన వ్యక్తిత్వ వికాస గ్రంథాల్లా ఉండవు. పాజిటివ్ యాటిట్యూడ్, టైం మేనేజ్‌మెంట్, గోల్ సెట్టింగ్ ..ఇలా ఉండదు వివరణ. చరిత్రలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించబడిన నియమాలు, సూత్రాలతో (Laws and Principles) వివరణ అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. These all principles are timeless and ruthless.

ఇవి శ్రీరంగ నీతులు అసలేకావు. పైగా అందుకు విరుద్ధమైనవి. సాధారణంగా మంచితనం, మానవత్వం, నిజాయితీ, మర్యాద-మన్నన, సత్యవాక్పరిపాలన, అపకారికి కూడా ఉపకారం చేయడం.. ఇలాంటి “సలక్షణాల”ను మనం ఉన్నత విలువలుగా భావిస్తుంటాం. కానీ ఈ గ్రంథాలు చదివిన తరువాత ఈ లక్షణాలన్నీ మనలను ఏ విధంగా బలహీనులుగా మారుస్తున్నాయో; మనలోని ఈ విధమైన లక్షణాలను ఆసరాగా చేసుకుని కొందరు ఏ విధంగా మన మీద పెత్తనం చెలాయిస్తున్నారో కొందరైతే మనలను ఏ విధంగా అణచివేతకు గురిచేస్తున్నారో, ఏ విధంగా మన వినాశనానికి కారణమౌతున్నారో మనకు బోధపడుతుంది.

రచయిత మనకు బోధించే విషయాలు ఒక్కోసారి కుట్రలు, కుతంత్రాల రూపంలో ఉంటాయి. కానీ మనం ఒక విషయాన్ని గ్రహించాలి. మనం ఉన్నత విలువలు అని వేటినైతే భావిస్తున్నామో అవి నిస్సందేహంగా ఉన్నతమైనవే. కానీ అవి సత్తెకాలంలో మాత్రమే ఆచరించదగినవి. కుట్రపూరితమైన నేటి కాలంలో అవి మనలను బలి పశువులుగా మార్చడానికి తప్ప దేనికీ పనికిరావు. శ్రీరంగనీతుల నుండి ఒక్కక్షణం బయటపడి వాస్తవికతతో ఆలోచిస్తే మనకు బోధపడే విషయం ఇదే. ముఖ్యంగా సత్తెకాలపు శ్రీరంగనీతులు ఉన్నత విలువలుగా భావించబడే భారతదేశంలో ఈ గ్రంథాల పఠనం అత్యంత ఆవశ్యకం.

గుంటనక్కలు, తోడేళ్ళు సంచరించే ఈ లోకంలో మోసాలు, కుట్రలు, కుతంత్రాలు ఇటువంటి మర్మాలేవీ తెలియకుండా అంతా భగవంతుడే చూసుకుంటాడనుకునే భక్తితత్త్వ ధోరణితో అమాయకంగా ఉంటే మంచివాళ్ళం, గంగిగోవులం  అనిపించుకుంటామేమోగానీ ఆ మోసాలు, కుట్రలు, కుతంత్రాలు చేసేవారికి మనం బలైపోకుండా మనలను ఆ భగవంతుడుకూడా రక్షించలేడు.

The Art of Seduction గ్రంథంలో సాధారణ సభ్య సమాజం అంగీకరించని ఎత్తుగడలను రచయిత చాలా వాటినే వివరిస్తాడు. అయితే మనం ఈ విషయాలన్నింటినీ తెలుసుకునేది వాటిద్వారా అమాయకులను బలితీసుకోవాలని కాదు. స్వయంగా మనం ఈ గుంటనక్కలు, తోడేళ్ళ బారిన పడి బలై పోకుండా డిఫెన్స్ చేసుకోవడం కోసం మాత్రమే. అందుకొరకైనా మనం వాటి గురించిన పరిజ్ఞానం పొందాలి. మనకు ఇంకా అవకాశం ఉంటే మనలను మనం రక్షించుకోవడమే కాకుండా అమాయకులెవరైనా ఈ తోడేళ్ళబారిన పడకుండా రక్షించనూవచ్చు. ఆ విధంగా మనం హీరోగా కూడా మారవచ్చు. అంటే ‘హీరో’ అవాలంటే ముందుగా ‘విలనీ’ ని అధ్యయనం చేయాలి. లేదంటే ఎవరో ఓ విలన్‌కు బలైపోయి మనలను రక్షించే హీరో కోసం ఎదురుచూసే అమాయక, అనామక victim గా మిగిలిపోక తప్పదు.

ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ మూడు పుస్తకాలనూ కూడా రచయిత కొన్ని సూత్రాల లేక నియమాల (Laws and Principles) విపులీకరణ  రూపంలో రచించాడు. ఆ నియమాలన్నింటినీ సాధారణ చరిత్ర గ్రంథాలలో లభ్యంకాని అనేక సూక్ష్మ చారిత్రక ఘటనల ద్వారా వివరిస్తూ, అనేక మంది చారిత్రక వ్యక్తులను పరిచయంచేస్తూ, వారి గుణగణాలనూ, వారి వ్యూహ ప్రతివ్యూహాలనూ, ఎత్తుగడలనూ, వారు జీవితంలో సాధించిన విజయాలనూ, పొందిన వైఫల్యాలనూ, వాటికి కారణాలనూ అత్యంత ఆసక్తికరంగా విపులీకరించాడు.

Robert Green ఈ గ్రంథాలలో కొంచెం High Standard English వాడాడు. సాధారణ వాడుకలో లేని క్లాసికల్ వర్డ్స్ అక్కడక్కడా కనిపిస్తాయి. నావరకూ నాకు dictionary అవసరమైనది. డిక్షనరీ ఉన్న CD ని PC లో open చేసుకుని ఈ పుస్తకాలు మూడింటినీ నేను చదివాను.

ఒక్కొక్క పుస్తకం షుమారు 450 పేజీలు ఉంటుంది. ఒక్కొక్క దాని ఖరీదు షుమారు Rs.400/- ఉంటుంది. The 48 Laws of Power కు, The Art of Seduction కు concise editions కూడా ఉన్నాయి. వాటి ఖరీదు ఒక్కొక్కటి Rs.125/-

నాకు తెలిసినంతవరకూ ఈ గ్రంథాలకు పైరేటెడ్ కాపీలు లేవు. కనుక పుస్తకాలు కారు చవకగా దొరికే మన అబిడ్స్ సండే మార్కెట్లో ఇవి దొరకక పోవచ్చు. హైదరాబాద్‌లో అయితే హిమాలయా బుక్ షాప్ వంటి చోట్ల దొరుకుతాయి. వైజాగ్ లో అయితే పేజెస్, జ్యోతి, గుప్తా బ్రదర్స్, బుక్ సెంటర్, వాగ్దేవి లాంటి చోట్ల దొరుకుతాయి. ఇవి విశాలాంధ్రలో కూడా దొరుకుతున్నాయి.

ఈ గ్రంథాలను చదవడం ద్వారా తెలుసుకున్న విషయాలతో పోలిస్తే వీటిని కొనడానికి మనం పెట్టిన డబ్బు, చదవడానికి మనం పడిన శ్రమ, కేటాయించిన సమయం చాలా స్వల్పమే అని గ్రహిస్తారు. ఈ పుస్తకాలను చదివిన తరువాత మీరు ఒక చాణక్యుడు, ఒక మాకియవెల్లి, ఒక sun-tzu అయిపోతారంటే నమ్మండి. :b.