మంచి పుస్తకం-సాధన రహస్యము (అనుభవానంద స్వామి)

భారత దేశపు తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చిన్న వయసులోఉన్న తన కుమార్తెకు జైలు నుండి అనేక ఉత్తరాల ద్వారా  ప్రపంచ చరిత్రను పరిచయం చేశాడు. ఆ ఉత్తరాలన్నీ గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ పేరుతో ఒక గ్రంథంగా ప్రచురింపబడ్డాయి. ఇది ఆంగ్ల సాహిత్యం లో ఒక గొప్ప గ్రంథంగా పరిగణింపబడుతున్నది. అలాగే మన తెలుగు సాహిత్యంలో కూడా ఇటువంటి గ్రంథమే ఒకటి ఉన్నది. అనుభవానంద స్వామి (1908-73) పిన్న వయసులో ఉన్న తన శిష్యురాలు మాతాజీ త్యాగీశానంద పురీ కి ఆథ్యాత్మిక మరియు సాధనా సంబంధమైన విషయాలను తెలియజేయటానికి 1946 లో అనేక ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాలన్నీ సాధన రహస్యము అనే గ్రంథంగా ప్రచురింప బడ్డాయి.

అనుభవానంద స్వామి 1908 లో గుంటూరు జిల్లా అమృతలూరులో జన్మించారు. ఈయన ఉన్నత విద్యాభ్యాసం చేసిన మేధావి. బహుముఖ ప్రజ్ఞావంతుడు. రచనలే కాక కవిత్వం, చిత్రకళ, వడ్రంగం, శిల్పం, సంగీతం ఇత్యాది వాటన్నింటిలో ప్రవేశమేకాక ప్రావీణ్యత కూడా ఉన్నది. కళాశాలలో చదివే రోజులలో అనేక బంగారు పతకాలు కూడా సాధించాడు. ఈయన సృష్టించిన కళా ఖండాలు నేటికీ పదిలంగా ఉన్నాయి. ఈయన భారత దేశమంతటా పర్యటించిన పరివ్రాజకుడు. సుధీర్ఘ కాలం అనేక కఠిన సాధనలు చేసిన సాధకుడు. మంచి వక్త. ఆంగ్ల భాషలో ప్రావీణ్యం కలిగిన వాడు.

ఈయన రామకృష్ణ పరమహంస చూపిన  మార్గంలో సన్యసించి తన  జీవితాన్ని కొనసాగించాడు. ఈయన ప్రాచీన భారతీయ సాహిత్యాన్ని అంటే వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, దర్శనాలు మొదలైన వాటన్నింటినీ మధించి వాటిని ప్రజలకు సుబోధకంచేస్తూ విస్తృతమైన  సాహిత్యాన్ని సృజించాడు. తన సాహిత్యాన్ని అనుభవానంద గ్రంథ మాల ద్వారా ప్రజలకు అందించాడు. బాపట్ల మరియు భీమునిపట్నంలలో ఈయన ఆశ్రమాలను నెలకొల్పాడు.

ఈయన రచనలలో ప్రధానమైనది  భారతీయ ఆథ్యాత్మిక విజ్ఞానానికి ఎన్ సైక్లోపీడియా అనదగిన సర్వసిధ్దాంత సౌరభం అనే గ్రంథం. ఈ  గ్రంథాన్ని ఈయన 12 సంపుటాలలో రచించారు. ఇందులో షడ్దర్శనాలనూ మరియూ అద్వైతం, విశిష్టాద్వైతం, వైష్ణవం, శైవం, శాక్తేయం, బౌధ్దం మొదలైన అన్ని సిధ్దాంతాలనూ విస్తృతంగా చర్చించారు. ఐతే ఈ గ్రంథం పండిత స్థాయిలో ఉంటుంది. కానీ మనం ప్రస్తుతం తెలుసుకుంటున్న సాధన రహస్యం అనే గ్రంథం మాత్రం సామాన్య పాఠకులందరికీ అర్థమయ్యేటట్లుగా ఉంటుంది.

తన శిష్యురాలికోసం రాసిన ఈ ఉత్తరాలలో అనుభవానంద స్వామి చాలా సులువైన వ్యావహారిక భాషను ప్రయోగించారు. ఆవిడ చిన్న వయసులో ఉన్నపుడు, సాధనా మార్గంలోకి రాకపూర్వం ఆవిడకు ఆథ్యాత్మిక సాధనా సంబంధమైన విషయాలను పరిచయం చేయటానికి ఈ ఉత్తరాలు ఉద్దేశింపబడినవి కనుక వీటిలో ఆయన సులభమైన శైలిని ఉపయోగించారు. ఈ కారణం చేతనే సాధారణ పాఠక లోకంలో ఈ గ్రంథం చాలా ప్రాచుర్యం పొందినది.

ఈ గ్రంథంలో అనుభవానంద స్వామి కర్మ, జ్ఞాన, రాజ, భక్తి యోగాలతోపాటు వివేక వైరాగ్యాది సాధనా చతుష్టయాన్ని గురించి పామరులకు సైతం అర్థమయ్యే విధంగా విపులంగా చర్చించారు. ఈ గ్రంథం అనేక భారతీయ భాషలతోపాటు ఫ్రెంచ్, జర్మన్ లాంటి పాశ్చాత్య  భాషలలోకి కూడా అనువదింపబడింది. భారతీయ ఆథ్యాత్మిక విషయాలలోని అర్థంకాని సంక్లిష్ట విషయాల జోలికి పోకుండా ఒక సాధారణ వ్యక్తికి ఆయా విషయాల యొక్క ప్రథమ పరిచయానికి తగినట్లుగా ఈ గ్రంథం వ్రాయబడినది కనుక ఇది ప్రతి ఒక్కరూ చదువదగిన గ్రంథం.

స్వామి అనుభవానంద యోగ కేంద్ర, భీమునిపట్నం-522163, విశాఖపట్నం జిల్లా ను గానీ లేక శ్రీ అనుభవానంద గ్రంథమాల, యం.జి.రోడ్,బాపట్ల-522 101,గుంటూరు జిల్లా ను గానీ సంప్రదించి  ఈ పుస్తకాన్ని పొందవచ్చు. సాహిత్యానికేతన్ లాంటి హిందూ మత సాహిత్యం దొరికే బుక్ స్టాల్స్ లో కూడా ఈ గ్రంథం దొరుకుతుంది.