చరిత్ర అంటే బోర్ సబ్జెక్ట్. రాజవంశాలను,రాజుల క్రమాన్ని,వారందరి పేర్లను గుర్తు పెట్టుకోవాలి. ఏ యుద్ధం ఎప్పుడు జరిగినదో ఆయా సంవత్సరాలన్నింటినీ గుర్తుంచుకోవాలి. ఇంత బోర్ సబ్జెక్టు ను కూడా కొంతమంది ఆసక్తికరంగా చెప్పగలరు. వారిలో జవహర్ లాల్ నెహ్రూ ఒకరు.
ఈయన తన కుమార్తె ఇందిరకు భారతదేశ చరిత్ర తో పాటు ప్రపంచ చరిత్ర యెడల అవగాహన కలిగించాలని సంకల్పించారు. ఇందుకొరకు ఆయన జైలులో ఉన్నపుడు దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆ సమయంలో ఆయన తన కుమార్తె కు రెండు మూడు రోజులకు ఒక ఉత్తరం చొప్పున మూడు నాలుగు సంవత్సరాలు నిరాటంకంగా వ్రాసారు. ఇవి మొత్తం 196 ఉత్తరాలు. ఈ జాబుల పరంపర 1930 వ సవత్సరం అక్టోబర్ నెలలో మొదలై 1933 ఆగస్ట్ వరకూ కొనసాగింది.
తదనంతర కాలంలో ఈ జాబులన్నీ గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ పేరుతో వేయి పేజీల ఒక పెద్ద గ్రంథం గా ప్రచురింపబడ్డాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వారు ఈ గ్రంథాన్ని చాలా కాలంపాటు సబ్సిడీ ధరకు అందించారు. ఐతే ఇటీవలి కాలంలో ఈ ప్రతులు మార్కెట్లో లభించుట లేదు. ప్రస్తుతం పెంగ్విన్ వారి ప్రతులే అందుబాటులో ఉన్నయి. ఐతే అవి కొంచెం ధర ఎక్కువ. నెహ్రూ గారి రచన కనుక ఈ పుస్తకం ఏ గ్రంథాలయం లోనైనా లభించగలదు. ఈ ఉత్తరాలు ఆంగ్ల భాషలో వ్రాయబడ్డాయి. ఐతే అవన్నీ పదమూడేళ్ళ వయసులో ఉన్న తన చిన్నారి కుమార్తెను ఉద్దేశించినవి కనుక నెహ్రూ వీటిలో చాలా సులువైన భాషనే ఉపయోగించారు. సాధారణమైన ఆంగ్ల భాషా పరిజ్ఞానం ఉన్నవారు సైతం వీటిని చదివి అర్ధం చేసుకోవచ్చు.
ఈ గ్రంథం చదివేటపుడు నెహ్రూలో మనకు ఒక అంతర్జాతీయ స్థాయి నాయకుడు కాక తన కుమార్తెను ఒక గొప్ప నాయకురాలిగా తీర్చిదిద్దాలని తపనపడే ఒక తండ్రి మాత్రమే కనిపిస్తాడు. ఈ గ్రంథం ఏ మాత్రం విసుగనిపించదు. సంవత్సరాలను అవసరమైనంత మేరకే సాధ్యమైనంత తక్కువగా పేర్కొంటూ చరిత్రలో అసలేమి జరిగింది అన్నదానికే ప్రాధాన్యతనిస్తూ చాలా ఆసక్తికరంగా నెహ్రూ దీన్ని రచించారు. ఈ గ్రంథాన్ని చదివే కొలదీ ఇంకా ఇంకా తెలుసుకోవాలనే తపనను మనలో కలుగజేస్తూ ఉంటుంది.
జవహర్ లాల్ నెహ్రూ ఈ గ్రంథం తో పాటు తన ఆత్మ కథ ఐన యాన్ ఆటోబయోగ్రఫీ అనే గ్రంథాన్నీ మరియూ భారత దేశ చరిత్రను,దాని యొక్క పురాతన వైభవాన్ని, దాని ఘన సంస్కృతిని మిగతా ప్రపంచానికి తెలియచేయాలనే ఉద్దేశ్యంతో డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్నీ కూడా రచించారు. ఐతే ఈ మూడింటిలో ‘గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ ‘అనబడే ఈ గ్రంథమే అత్యంత ప్రజాదరణ పొందినది.
ఈ గ్రంథం చదివిన తరువాత ఎవరికైనా ప్రపంచ చరిత్ర గురించి పూర్తి అవగాహన కలుగుతుంది. ఒక్క భారతదేశ యువతకే కాక యావత్ ప్రపంచ దేశాలలోని యువత మొత్తానికీ ఉపయుక్తమయ్యే విధంగా ఈ ఉత్తరాలను రచించి నెహ్రూ ఒక అంతర్జాతీయ స్థాయి నాయకుడిగా తన స్థానాన్నీ,స్థాయినీ ఇనుమడింప చేసుకున్నారు.