మంచి పుస్తకం-భారత జాతికి నా హితవు(స్వామి వివేకానంద)

మంచి పుస్తకం శీర్షికతో మీకు నేను చదివిన వాటిలో కొన్ని మంచి పుస్తకాలను,ఆయా పుస్తకాలు దొరికే ప్రదేశాలను మరియు కొన్ని మంచి పుస్తక ప్రచురణ సంస్థలను పరిచయం చేద్దామనుకుంటున్నాను.

సాధారణంగా పత్రికలలో వచ్చే సమీక్షలు మార్కెట్లో కొత్తగా విడుదలైన పుస్తకాలకే రాస్తారు. అది కూడా విడుదలైన ప్రతి పుస్తకానికీ రాస్తారు. మనం వాటిలోనుండి చదువదగ్గ దానిని, బాగున్నదానిని ఎంచుకోవటం కష్టం. అందుకే నేను ఈ శీర్షిక పుస్తక ప్రియులకు ఉపయుక్తంగా ఉంటుందని వ్రాస్తున్నాను. అలాగే మీ అభిప్రాయాలతో పాటు మీరు చదివిన మంచి పుస్తకాలను కూడా సూచించగలరు.

ముందుగా వివేకానందుని బోధనల సంగ్రహ సంకలనమైన భారత జాతికి నా హితవు అనే పుస్తకం గురించి పరిచయం చేస్తాను. దీనిని రామకృష్ణ మఠం వారు ప్రచురించారు. ఈ పుస్తకం మన జేబులో పెట్టుకోదగిన పరిమాణంలోనే ఉంటుంది. ఇది ఆంగ్ల భాషలోని ‘స్వామి వివేకానంద-హిజ్ కాల్ టు ద నేషన్ ‘ అనే చిరు గ్రంథానికి అనువాదం.  అసలు వివేకానందుని బోధనలున్న పుస్తకమేదైనా యువకులను ఎంతగా ఆకట్టుకుంటుందో, వారిని ఎంతగా ఉత్తేజితులను చేస్తుందో అందరికీ తెలుసు. ఐతే వాటన్నింటిలో కూడ ఈ పుస్తకం ఎన్నదగినది. ఈ చిరు గ్రంథం ఆ మహానుభావుడు బోధించిన అనేకానేక విషయాలలో ఏదో ఒక ప్రత్యేక విషయానికి సంబంధించినదిగా కాక దాదాపు ఆయన బోధనలన్నింటినీ సంగ్రహంగా తెలియచేస్తుంది. ఆయన జీవిత కథ కూడా ఇందులో పొందుపరచబడి ఉన్నది. ఈ పుస్తకం బహుళ ప్రాచుర్యం పొందినది. ఎందరో యువకులు మరియు పెద్దలు ఈ పుస్తకాన్ని తమకు తెలిసిన వారికి బహుమతిగా ఇస్తుంటారు. అందుకొరకే రామకృష్ణ మఠం వారు ఈ పుస్తకాన్ని సబ్సిడీ ధరతో మూడు రూపాయలకే అందిస్తున్నారు. దీనిని పదుల సంఖ్యలో పంచే వారు ఎందరో ఉన్నారు. రామకృష్ణ మఠం వారి విక్రయశాలలలో మరియు విశాలాంధ్ర లాంటి ప్రఖ్యాత బుక్ స్టాల్స్ లో ఈపుస్తకం లభ్యమౌతుంది.

వ్యాఖ్య ను ఉంచండి