రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లేక సంక్షిప్తం గా ఆర్.యస్.యస్. దీనిని గురించి తరచూ మనం పత్రికల లో చదువుతూ ఉంటాం. వివిధ రాజకీయ పార్టీల నాయకుల ఉపన్యాసాల ద్వారా మరియు స్టేట్ మెంట్ల ద్వారా కూడా దీనిని గురించి తెలుసుకుంటూ ఉంటాం. వీరిలో ఆర్.యస్.యస్.ను ఒక హిందూ మత వాద చాంధస సంస్థగా విమర్శించే వారే ఎక్కువ. దీనివలన మనకు కూడా ఆర్.యస్.యస్. గురించి ఒక నెగెటివ్ ఫీలింగ్ ఏర్పడే అవకాశం ఉంది.
జిజ్ఞాసువులు, గ్రంథ పఠనాభిలాష కలిగినవారు ఈ సిద్దాంత విభేదాలకు లోనవ్వ కూడదు. ఒక వేళ మనకు స్వంత అభిప్రాయాలున్నా కూడా వాటిని పుస్తకాల మీద చూపించకూడదు. వివిధ వాదాలను తెలిపే పుస్తకాలన్నింటినీ చదవాలి.అపుడే మనకు సరి ఐన దృక్పథం అలవడుతుంది. ఆసక్తి ఉంటే ఏ గ్రంథమైనా చదువవచ్చు. కేవలం సిద్దాంత విభేదాలతో ఒక గ్రంథాన్ని చదాలన్న ఆసక్తిని అణచుకోకూడదు.
ఏదేని ఒక విషయం గురించి తెలుసు కోవటం తప్పనిసరి అయినపుడు సరైన పద్దతిలో తెలుసుకొని దాని గురించి మన స్వంత అభిప్రాయాన్ని ఏర్పరచుకోవటం అన్నివిధాలా మంచిది. ఆలా మనం ఆర్.యస్.యస్. గురించి తెలుసుకోవాలనుకుంటే ‘పాంచజన్యం ‘ అనే ఈ గ్రంథాన్ని చదవటం సరి అయిన పని. దీని ఆంగ్ల మూలం పేరు ‘బంచ్ ఆఫ్ థాట్స్ ‘. దీని హిందీ అనువాదం పేరు ‘విచార్ ధన్ ‘. ఇది ఆరేడు వందల పేజీల ఉద్గ్రంథం. ఆర్.యస్.యస్. వర్గాలకీ గ్రంథం బైబిల్ లాంటిది. ఈ గ్రంథం ఎవరూ రచించినది కాదు. ‘గురూజీ ‘ గా సుప్రసిద్దులైన మాధవ సదాశివ గోల్వల్కర్ ఆర్.యస్.యస్.కు సర్ సంఘ్ చాలక్ గా ఉన్న 33 సంవత్సరాల (1940-1973) సుదీర్ఘ కాలం లో చేసిన అనేక ఉపన్యాసాలలోని ముఖ్యమైన విషయాలను, ఆర్.యస్.యస్. భావజాలాన్ని ప్రతిబింబించేటట్లుగా ఏర్చికూర్చి చేసిన సకలనం ఈ గ్రంథం.
ఆర్.యస్.యస్. అనే మొక్కను హెడ్గేవార్ నాటితే, ఆ మొక్కను గోల్వల్కర్ చెట్టు గా పెంచారు. దేవరస్ ఆ చెట్టును వట వృక్షంగా పెంపొందించారు అని తెలిసిన వారు అభివర్ణిస్తారు. ఈ ముగ్గురిలో కూడా గోల్వల్కర్ విశేష ఖ్యాతి నార్జించారు. ఆర్.యస్.యస్. కు పటిష్ఠమైన పునాదులేర్పరచి దానిని చిరకాలం నిలచి ఉండే సంస్థగా తీర్చిదిద్దారు. ఆ సంస్థ నుండి పుట్టిన ఒక శాఖ ఐనటువంటి బి.జె.పి. పార్టీ భారతదేశాన్ని పాలించే స్థాయికి ఎదిగినదంటే ఆ సంస్థకు ఎంతటి బలమైన పునాది ఉన్నదో, ఆ సంస్థ వెనుక ఎంతటి పవిత్ర సంకల్ప శక్తి దాగి ఉన్నదో మనం ఊహించికోవచ్చు.
ఈ గ్రంథం ద్వారా ఆర్.యస్.యస్. గురించి , దాని మౌలిక భావజాలం గురించి ,‘హిందూ రాష్ట్ర ‘ సిద్దాంతం గురించి మనం ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. ఆర్.యస్.యస్.,విశ్వ హిందూ పరిషత్ మొదలైన సంస్థలు తమ భావ ప్రచారానికి గాను గ్రంథాలను ప్రచురించటానికి, విక్రయించటానికి ‘సాహిత్యానికేతన్ ‘ అనే సంస్థను ఏర్పాటు చేశాయి. హైదరాబాదు లోని బర్కత్ పురా లో మరియు విజయవాడ లోని ఏలూర్ రోడ్ లో సాహిత్యానికేతన్ విక్రయశాలలు ఉన్నాయి. ఆక్కడ ఈ పాంచజన్యం గ్రంథం లభించగలదు.